Clock Of Nellore ( Nellore ) – బంగారు ఆభరణాల తయారీ షాపులో నమ్మకంగా పనిచేస్తూ 130 గ్రాముల బంగారంతో ఉడాయించిన కేటుగాడ్ని నెల్లూరు సంతపేట పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 5లక్షలా 40వేల రూపాయల విలువైన 108 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. సంతపేట పోలీస్ స్టేషన్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో నగర ఇంఛార్జ్ డిఎస్పీ జి. శ్రీనివాస రావు కేసు వివరాలను తెలియజేశారు. నెల్లూరు కొరడావీధిలోని షేక్ నిజాంకు చెందిన బంగారు ఆభరణాల దుకాణంలో గత కొంతకాలంగా వెంకటేశ్వరపురంకు చెందిన షేక్ మన్సూర్ నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 8వ తేదీనా 130 గ్రాముల ప్యూర్ బంగారాన్ని మన్సూర్ కి ఇచ్చి కరిగించుకుని రావాలని యజమాని నిజాం చెప్పారు. కరిగించుకుని వస్తానని వెళ్లిన మన్సూర్ ఇక రాలేదు. 130 గ్రాముల బంగారంతో ఉడాయించాడు. విషయాన్ని గ్రహించిన యజమాని నిజాం సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ దశరథరామారావు, ఎస్సై భాలకృష్ణ వారి బృందం సాంకేతికత ఆధారంగా బుధవారం ముద్దాయిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. చోరీ చేసిన 130 గ్రాముల బంగారంలో 108 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసినట్లు డిఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు. ముద్దాయి మన్సూర్ ను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలియజేశారు.