Clock Of Nellore ( Ongole ) – ఒంగోలు ఎంపి అభ్యర్ధిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. ఇవాళ పెండింగ్ లో ఉన్న నాలుగు ఎంపి, తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్ధులను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఒంగోలు ఎంపి అభ్యర్ధిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఖరారు చేసింది. వైసీపి ఎంపిగా కొనసాగుతున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మరో సారి ఎంపిగా అవకాశం ఇచ్చేందుకు ఆ పార్టీ విముఖత వ్యక్తం చేసింది. మాగుంటకు సమాచారం లేకుండానే ఒంగోలు పార్లమెంటు ఇంఛార్జ్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆ పార్టీ నియమించింది. దీంతో మనస్థాపానికి గురైన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇటీవల కుమారుడు రాఘవ రెడ్డితో కలిసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సారి ఒంగోలు ఎంపిగా తన కుమారుడు మాగుంట రాఘవ రెడ్డికి అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరారు. అయితే వివిధ సమీకరణలను దృష్ఠిలో ఉంచుకుని మీరే పోటీ చేయాలంటూ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చంద్రబాబు సూచించారు. ఇవాళ ఒంగోలు పార్లమెంటు స్థానానికి మాగుంట పేరును పార్టీ ప్రకటించింది.