Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని విఆర్ లా కళాశాలలో బుధవారం ఘర్షణ వాతావరణం నెలకొంది. కళాశాల పూర్వ విద్యార్ధి శ్యాం సుందర్ అనే వ్యక్తి సర్టిఫికేట్ల విషయంలో ప్రిన్సిపల్ తో వాగ్వాదానికి దిగగా అదే క్రమంలో అక్కడున్న లెక్చరర్ నారాయణ రావు అతన్ని వారించాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో నారాయణ రావు అస్వస్థతకు గురి కాగా అక్కడి వారు 108కి సమాచారం అందించారు. 108 సిబ్బంది ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. తనపై శ్యాం సుందర్ దాడి చేశాడని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మరో వైపు ఈ విషయంపై శ్యాం సుందర్ మాట్లాడుతూ గతంలో కళాశాలలో జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాననే కక్ష్యతో తన సర్టిఫికేట్లు ఇవ్వకుండా ప్రిన్సిపల్ ఇబ్బంది పెడుతున్నారని, ఇవాళ సర్టిఫికేట్లు అడిగితే తనను దుర్భాషలాడటమే కాకుండా లెక్చరర్ నారాయణ రావు తనపై దాడి చేయించారని పేర్కొన్నారు. తనపై దాడి చేయడమే కాకుండా తానే దాడి చేసినట్లు కింద పడిపోయి నాటకాలు ఆడారన్నారు. కళాశాలలోని సిసి కెమరా ఫుటేజీ పరిశీలిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని శ్యాం సుందర్ అంటున్నాడు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు సర్టిఫికేట్లు అవసరమై ఉన్నాయని, సర్టిఫికేట్లు ఇవ్వకుండా ప్రిన్సిపల్ తనను వేధిస్తున్నాడని వాపోయాడు. తానూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశాడు.