Clock Of Nellore ( Nellore ) – ఈనెల 7వ తేదీనా నెల్లూరులో నిర్వహించతలపెట్టిన కార్తీక మహా దీపోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పక్కనే గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి… అధికారులతో కలిసి పరిశీలించారు. 7వ తేదీ ఉదయం శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తామని ఈ సందర్భంగా కోటంరెడ్డి తెలియజేశారు. కళ్యాణం అనంతరం అభిషేకం, యాగాలు నిర్వహిస్తారన్నారు. సాయంత్రం 4 గంటలకు కేరళ మహిళలచే పంబమేళ, కోలాటాలు, మహిళా మంగళ వాయిద్యాల ప్రదర్శన, వివిధ రకాల సాంస్క్రృతిక కార్యక్రమాలు, 1008 మంది మహిళలతో కార్తీక దీపాలతో నగరంలో శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు. గణేష్ నిమజ్జన ఘాట్ వరకూ శోభాయాత్ర సాగుతుందని, అనంతరం సాయంత్రం 6 గంటలకు హరిద్వార్ నుండి వచ్చిన అర్చకులచే గంగా హారతి జరుగుతుందని కోటంరెడ్డి మీడియాకు తెలిపారు. గంగా హారతి కార్యక్రమానికి హాజరైన భక్తులపై దేశంలో ఉన్న 12 పుష్కర జీవ నదుల పవిత్ర నీటిని డ్రోన్ల ద్వారా సంప్రోక్షణం చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర వాసులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్తీక దీపోత్సవ వేడుకలకు అన్నీ విధాలా సహకరిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ ట్రస్టీ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్, బిజివేముల రమణారెడ్డి, బిజివేముల భాస్కర్ రెడ్డి, పడవల సుధాకర్, పాల నారాయణరెడ్డి, బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్ లకు ఎమ్మెల్యే కోటంరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
