Clock Of Nellore ( Kaluwai ) – అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం అందరూ చూసే ఉంటారు. ఆ చిత్రంలో అల్లు అర్జున్ ఎర్రచందనం నరికే కూలీ స్థాయి నుండి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నాయకునిగా ఎదిగే స్థాయి వరకూ ఎలా ఎదిగారు అనే ఇతి వృత్తంతో ఉంటుంది. ఆ క్రమంలో రెండు స్మగ్లింగ్ గ్రూపుల మధ్య వార్ సన్నివేశాలు కూడా ఉంటాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని చివరకు చంపుకునే స్థాయి వరకూ వెళతారు. ఆ తరహా ఎర్ర చందనం స్మగ్లింగ్ గ్యాంగ్ వార్ నెల్లూరుజిల్లాలో తాజాగా వెలుగు చూసింది. కలువాయి మండలం, ఎర్రబల్లి అటవీ ప్రాంతంలో చంద్ర అనే వ్యక్తి గురువారం దారుణ హత్యకు గురైనాడు. అడవిలో ఎర్ర చందనం నరికే కూలీలకు భోజనం తీసుకెళుతుండగా చంద్రను హత్య చేసినట్లు ఆనవాళ్లు లభించాయి. దుండగులు చంద్ర కాళ్లు నరికి, తలపై తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఈ హత్యకు గ్యాంగ్ వారే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య జరిగిన సమీపంలో 26 ఎర్ర చందనం దుంగలు కూడా లభించాయి. స్మగ్లర్ల మధ్య విభేదాలే కారణాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కలువాయి పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు అటవీ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడున్న ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
