కందుకూరులో మంత్రి ఆనం సుడిగాలి పర్యటన : అభివృద్ధి పనులకు శ్రీకారం

Clock Of Nellore ( Kandukuru ) – దేవాదాయ శాఖలో ఇచ్చిన ప్రతి హామీని గత సంవత్సర కాలంలో నెరవేర్చినట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం కందుకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం సుడిగాలి పర్యటన జరిపారు. తొలుత కందుకూరు పట్టణ ప్రజల ఇలవేలుపు అంకమ్మతల్లి దేవాలయంలో మంత్రి ఆనం, ఎం ఎల్ ఎ ఇంటూరి నాగేశ్వరరావు తో కలసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంకమ్మతల్లి దేవాలయ ఆవరణలో నిర్మించ తలపెట్టిన షాపింగ్ కాంప్లెక్స్ కు భూమిపూజ చేశారు. అనంతరం ఆర్ టి సి ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ కు భూమిపూజ చేసి, నేరుగా చుండి గ్రామానికి చేరుకుని, చుండి నుండి కాకర్లపాలెం, చిన్నమ్మపాలెం, గాంధీ నగర్ వరకు నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభోత్సవం చేశారు. అక్కడ నుండి మాలకొండ కు చేరుకుని నూతనంగా నిర్మించ తలపెట్టిన డార్మిటరీ, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం శ్రీ లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నిత్య అన్నదాన ప్రసాదం పధకాన్ని స్వయంగా మంత్రి, దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్, ఎం ఎల్ ఎ లతో కలసి పరిశీలించారు. భోజనం రుచి, శుద్ధి తదితరాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే భక్తులతో కలసి మంత్రి సైతం భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అందువల్లే గతంలో కంటే 30 శాతం అధికంగా భక్తులు దేవాలయాలను దర్శించుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాల పునర్నిర్మాణానికి 500 కోట్లు వ్యయం చేశామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే క్రమంలో ధూప దీప నైవేద్యాలకు పదివేల రూపాయలు ఇస్తున్నామన్నారు. అలాగే అర్చకుల సంభావనను 15 వేలకు పెంచామన్నారు. అదేవిధంగా దేవాలయాల పాలక మండళ్లలో బ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ వర్గాలకు చెందిన ఇద్దరు సభ్యుల్ని నియమించే విధంగా చట్ట సవరణ చేసామన్నారు. అలాగే వేదం చదివిన వారికి మూడు సంవత్సరాల పాటు నెలకు 3000 చొప్పున నిరుద్యోగ సంభావన మంజూరు చేసామన్నారు. దీనివల్ల 6 వేల మంది వేద పండితులకు లబ్ది కలుగుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని 6 – ఏ కేటగిరి లోని 148 ఆలయాలకు గాను 70 ఆలయాల్లో నిత్య అన్నదాన ప్రసాదం ప్రారంభించామన్నారు. ఇందులో మాలకొండ దేవస్థానం కూడా ఉన్నదన్నారు. వీలైనంత త్వరలో మిగిలిన వాటిలో కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా దేవాలయాల పూజాధికాలలో అధికారుల ప్రమేయం ఉండకూడదనేది ప్రభుత్వ నిర్ణయమన్నారు.

అంకమ్మతల్లి దేవాలయ పునః నిర్మాణ పనులు త్వరలో పూర్తి…
ఆలయ నిర్వహణ కష్టమైన నేటి పరిస్థితుల్లో పట్టణ నడిబొడ్డున ఉన్న అంకమ్మ తల్లి దేవాలయ ఆవరణ స్థలాన్ని ఆదాయ మార్గంగా మార్చే క్రమంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని పట్టణ పెద్దలు, ఎం ఎల్ ఎ ఆలోచన చేశారన్నారు. ఇందులో షాపులు నిర్వహించేవారు లీజుదారులే గాని హక్కుదారులు కాదన్నారు. హక్కుదారుగా కేవలం అంకమ్మ తల్లి అమ్మవారే ఉంటారని తెలిపారు. అమ్మవారికి నిత్య కైంకర్యాలతో పాటు ప్రతి సంవత్సరం జాతర నిర్వహించేందుకు అందరి అభిప్రాయాలు సేకరించి ఒక విధానం రూపొందిస్తామన్నారు మంత్రి ఆనం వెల్లడించారు.

మాలకొండ అభివృద్ధి కి ప్రత్యేక చర్యలు…
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మాలకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నిర్మించిన అతిధి గృహాన్ని మంత్రి ప్రారంభించారు. నిత్య అన్నదాన ప్రసాదాన్ని స్వీకరిస్తున్న భక్తులతో మాట్లాడారు. భోజనం రుచి గురించి ఆరా తీశారు. ప్రస్తుతం ఒకసారి 300 మంది భక్తులు భోజనం చేసే అవకాశాలు ఉన్నాయని, త్వరలో ఒకేసారి వేయి మంది భక్తులు భోజనం చేసేందుకు అనుకూలంగా అభివృద్ధి చర్యలు చేపడతామన్నారు.

Read Previous

హై రిస్క్ ప్రెగ్నెన్సీ మహిళలకు నెల్లూరు మెడికవర్ లో సురక్షితరమైన కాన్పులు

Read Next

నకిలీ IRS అధికారిని అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

Leave a Reply

Your email address will not be published.