Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని గత ఎన్నికల హయాంలో ఐటి టీముల్లో పనిచేసిన యువతను ఆ పార్టీ నట్టేటా ముంచి వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిందని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే స్థిరపడవచ్చు అనే ఉద్దేశ్యంతో వైసీపి ఐటి టీముల్లో పనిచేసేందుకు వచ్చిన యువతకు ఉపాధి కాదు కదా కనీసం స్వయం ఉపాధి కూడా చూపకపోవడం దారుణమని అన్నారు. పవనన్న ప్రజాబాటలో భాగంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి 38వ రోజు నెల్లూరు మైపాడురోడ్డులోని సత్యనారాయణ పురంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడుతామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం ప్రజలను ఉద్దేశించి కేతంరెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో వందలాది మంది యువతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురి చేసి ఐటి టీముల్లో పనిచేయించారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతో యువత ఐటి టీముల్లో చేరి వైసీపికి అనుకూలంగా డిజిటల్ ప్రచారం చేశారన్నారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యువతను గాలికి వదిలేశారని విమర్శించారు. అప్పులు తెచ్చి మరీ పథకాల పేరుతో డబ్బును పప్పు బెల్లాల మాదిరిగా పంచుతున్న సిఎం జగన్ యువతకు కనీసం ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేకున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే వివిధ కార్పొరేషన్ల ద్వారా యువతకు 10 లక్షల రూపాయల రుణాలు ఇస్తామని కేతంరెడ్డి హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఏటా లక్ష కుటుంబాలకు 10వేల కోట్ల రూపాయలు కేటాయించి, ఒక్కో కుటుంబానికి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా 10 లక్షల రూపాయలు ఆర్ధిక సాయం చేస్తామన్నారు.
