Clock Of Nellore ( Nellore ) – క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగర వ్యాప్తంగా చేపడుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనుల యూజర్ చార్జీల వసూళ్లను వేగవంతం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్… ప్రజారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ చాంబర్ నందు ప్రజారోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ యూజర్ చార్జీల వసూళ్ళలో కొన్ని సచివాలయాల సిబ్బంది పనితీరు బాగోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్దేశించిన పన్నుల లక్ష్యాలను సూచించిన గడువులోగా ప్రతిఒక్కరూ వసూళ్ళను పూర్తి చేయాలని ఆదేశించారు. పన్నుల వసూళ్ళలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, శానిటేషన్ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్ లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
