
Clock Of Nellore ( Nellore ) – దక్షిణ భారతదేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా బారాషహీద్ దర్గాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ తెలిపారు. గురువారం బారాషహీద్ దర్గా ఉత్తర, దక్షిణ ముఖద్వారాల నిర్మాణ పనులకు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ సూర్యతేజతో కలిసి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నుడా, మున్సిపల్ కార్పొరేషన్లో అందుబాటులో వున్న నిధులను వినియోగించి దర్గా ఆర్చి నిర్మాణ పనులు మొదలుపెడుతున్నట్లు చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా బారాషహీద్ దర్గా సమగ్ర అభివృద్ధికి పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి టూరిజం డిపార్టుమెంటుకు పంపనున్నట్లు చెప్పారు. దర్గాలో మసీదు నిర్మాణానికి ముఖ్యమంత్రి మంజూరు చేసిన 5 కోట్ల నిధుల మంజూరుకు కూడా కృషిచేస్తున్నట్లు చెప్పారు.
రొట్టెల పండుగ నాటికి ఆర్చి నిర్మాణాలు పూర్తి : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ 85లక్షలతో ఆర్చి నిర్మాణ పనులను తమ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. రొట్టెలపండుగ నాటికి ఈ ఆర్చి నిర్మాణాలు పూర్తి చేసి దర్గాకు సరికొత్త శోభన తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. మసీదు నిర్మాణానికి కూడా నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఆర్చి నిర్మాణాలకు నిధుల మంజూరుకు కృషి చేసిన కలెక్టర్, కమిషనర్కు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నెల్లూరు రూరల్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న శ్రీధర్రెడ్డి : అబ్దుల్ అజీజ్
అభివృద్ధి పనులకు ఎక్కడి నుంచైనా నిధులు తెచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నెంబర్వన్ గా నిలుపుతాడన్నారు. బారాషహీద్ దర్గా అభివృద్ధికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.